టీ20 ప్రపంచకప్ అంపైర్ల జాబితాలో మనోడు.. నితిన్ మేనన్‌కు చోటు

  • 16 మందితో కూడిన అంపైర్ల జాబితాను విడుదల చేసిన ఐసీసీ
  • గత ప్రపంచకప్‌లో సేవలు అందించిన వారికే మళ్లీ చాన్స్
  • ఇండియా నుంచి నితిన్ మీనన్‌కు మాత్రమే చోటు
టీ20 ప్రపంచకప్‌లో సేవలు అందించనున్న అంపైర్లు, మ్యాచ్ రిఫరీల జాబితాను ఐసీసీ ప్రకటించింది. వీరిలో ఇండియా నుంచి ఒకే ఒక్కరికి చోటు దక్కింది. మొత్తం 16 మందితో కూడిన అంపైర్ల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. వీరిలో ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో ఉన్న భారతీయ అంపైర్ నితిన్ మేనన్‌ కూడా ఉన్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్ కోసం నితిన్ మేనన్ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. మొత్తంగా ఈ టోర్నీలో 16 మంది అంపైర్లు సేవలు అందిస్తారు. ఇది అనుభవజ్ఞులతో కూడిన అంపైర్ల గ్రూప్ అని, గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ వేదికగా  జరిగిన టోర్నీకి సేవలందించిన వారే ఈ టోర్నీకీ ఎంపికైనట్టు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీల చీఫ్ రిఫరీ రంజన్ మదుగలే తెలిపారు.   

ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16న శ్రీలంక-నమీబియా మధ్య గీలాంగ్‌లో ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు జోయెల్ విల్సన్, రాడ్నీ టకర్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. పాల్ రీఫెల్ టీవీ అంపైర్‌గా, ఎరాస్మస్ ఫోర్త్ అంపైర్‌గా ఉంటారు. ఎరాస్మస్‌, టకర్, అలీమ్ దార్‌కు ఇది ఏడో టీ20 ప్రపంచకప్ కాగా, లాంగ్టన్ రుసెరె‌కు ఇది ఈ ఏడాదిలో రెండో ప్రపంచకప్. ఈ ఏడాది జరిగిన మహిళల ప్రపంచకప్‌‌లోనూ ఆయన అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఫైనల్‌కు రిజర్వ్ అంపైర్‌గానూ ఉన్నారు.

Nitin Menon
ICC
Umpires
T20 World Cup
ICC Elite Panel

More Telugu News